contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు: అమిత్ షా

నిజామాబాద్: “తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదు. అధికారం మారింది కానీ, దోపిడీ తీరు మాత్రం మారలేదు!” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ఆదివారం జరిగిన రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు.

పసుపు రైతులకు శుభవార్తగా, జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, “రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దల ఏటీఎంగా మార్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ అవినీతి కప్పిపుచ్చుకుంటూ, కాంగ్రెస్ అదే మార్గాన్ని అనుసరిస్తోంది” అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తుతూ, “ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదు? వాళ్లూ వీళ్లూ దొందూ దొందే” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు.

2026 నాటికి నక్సలిజం అంతం: తుపాకులకు గుడ్‌బై చెప్పండి

అమిత్ షా నక్సలైట్లకు కూడా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. “నక్సలిజాన్ని దేశం నుండి నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైంది. 2026 మార్చి 30 నాటికి దేశంలో నక్సలిజం అనే పదమే లేకుండా చేస్తాం. ఇది మోదీ గ్యారెంటీ. తుపాకులు పక్కనపెట్టి, హత్యలు ఆపి ప్రజలలో కలవండి. లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు.

నిజామాబాద్ రైతుల కలను సాకారం చేసిన పసుపు బోర్డు

నిజామాబాద్ రైతులు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హామీ నెరవేరిందని అమిత్ షా చెప్పారు. “ఇది మోదీ ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతకు నిదర్శనం. బోర్డు ఏర్పాటుతో పాటు, భారత్ ఆర్గానిక్, భారత్ ఎక్స్‌పోర్ట్ సంస్థలూ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. నిజామాబాద్ పసుపు ప్రపంచ విపణిలో తనదైన స్థానం సంపాదిస్తుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజకీయంగా ఉగ్రవాదం, అవినీతి, నక్సలిజంపై కఠినంగా వ్యవహరిస్తాం

ఈ ప్రసంగంలో అమిత్ షా తనదైన రాజకీయ కత్తిరింపు మెలకువ చూపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై సమంగా మండిపడ్డ ఆయన, దేశ భద్రత, రైతుల అభివృద్ధి, అవినీతి నిర్మూలన వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. “ఇది మోదీ మాట కాదు… మోదీ గ్యారెంటీ” అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :