సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో ప్రజల సందర్శనార్థం ఉంచిన సురవరం పార్థివ దేహం వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సురవరం చిత్రపటం వద్ద తన సంతాప సందేశాన్ని రాశారు.
రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా, ఒక సీనియర్ నేతకు గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మగ్దూం భవన్కు వెళ్లారు. అక్కడ సురవరం భౌతికకాయానికి అంజలి ఘటించి, ఆయన ప్రజాసేవను స్మరించుకున్నారు. దశాబ్దాల పాటు వామపక్ష ఉద్యమంలోనూ, పార్లమెంటు సభ్యునిగానూ సురవరం సుధాకర్ రెడ్డి దేశానికి, తెలుగు ప్రజలకు అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఇవాళ ఆయన అంతిమయాత్ర జరగనుంది. అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రి మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు.