అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, యావత్ భారతదేశ చరిత్రలోనే శనివారం ఒక చారిత్రక దినంగా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రపంచం ముందున్న క్వాంటమ్ విప్లవంలో భారత్ అనుసరించడమే కాదు, ఏకంగా నాయకత్వం వహించబోతోందని స్పష్టం చేశారు. ఆ మహాయజ్ఞానికి అమరావతి నుంచే పునాది వేస్తున్నామని తెలిపారు.
అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన తన దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
ఐటీ విప్లవం తర్వాత మరో గేమ్ ఛేంజర్
తన గత అనుభవాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు, “1995లో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో బిల్ గేట్స్ ఇంటర్నెట్ను ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పుడు దాని ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రాన్ని ఆ దిశగా నడిపించాను. మాజీ ప్రధాని వాజ్పేయి గారు టెలికమ్యూనికేషన్ రంగంలో సంస్కరణలు చేపట్టడం, నేను హైటెక్ సిటీని ప్రారంభించడం దేశ ఐటీ రంగంలో గేమ్ ఛేంజర్గా మారాయి” అని చెప్పారు.
ఆనాడు వాజ్పేయి గారు హైటెక్ సిటీని ప్రారంభిస్తే, నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి పునాది పడిందని పేర్కొన్నారు. ఇది దేశానికే మరో గేమ్ ఛేంజర్ అవుతుందని, ఈ చరిత్రలో మనమందరం భాగస్వాములమని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ
తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోనుందని సీఎం తెలిపారు. ఇది కేవలం ఒక భవనం కాదని, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు.
అమరావతికి తొలి క్వాంటమ్ కంప్యూటర్
ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. “భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావాలి. ఒకటి రెండు నెలల్లో ఒప్పందాలు పూర్తిచేసి, ఈ ఏడాది చివరికల్లా తొలి క్వాంటమ్ కంప్యూటర్ను ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 14 నాటికి మరో రెండు క్వాంటమ్ సెంటర్లను ప్రారంభిస్తాం” అని లక్ష్యాలను నిర్దేశించారు.
2030 నాటికి రాష్ట్రంలో 2.5 లక్షల మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయాలనే బృహత్ ప్రణాళికను కూడా సీఎం వెల్లడించారు.
అమరావతికి బిల్ గేట్స్
అమరావతిని ప్రపంచ పటంలో నిలపాలన్న తన సంకల్పానికి మరింత బలం చేకూర్చుతూ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న అమరావతికి రానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రకటన సభలో హర్షాతిరేకాలను రేపింది. దేశంలోని ఐటీ నిపుణుల్లో 35 శాతం మంది తెలుగువారేనని గుర్తు చేసిన ఆయన, వారి ప్రతిభను రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేశ్, ఐఐటీలు, టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ సాంకేతిక హబ్గా మార్చే దిశగా ఒక చారిత్రక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.








