తమకు తమ పాఠశాలలోనే చదువుకునే అవకాశం కల్పించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం భీమవరం గ్రామం వడ్డీ పాలెం లోని ప్రాథమిక పాఠశాల3, 4, 5 తరగతుల పిల్లలు తల్లిదండ్రులు సీపీ(ఐ)యం నాయకులు ఆధ్వర్యంలో శనివారం మండల విద్యావనరుల కేంద్రం ఎదుట ధర్నా చేశారు. గ్రామంలోని వేరే పాఠశాలకు వెళ్లడం తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని వాపోయారు. మా పాఠశాల మాకే ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు తమ నిరసన తెలిపారు. పాఠశాలలను విలీనం చేయవద్దని పిల్లలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ‘మా బడి మాకు కావాలి’ అని తల్లిదండ్రులు నినాదాలు చేసారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడుతూ రోజు వారి కూలీ పనులు చేసుకునే తాము ఉదయాన్నే వెళ్లాలని, పిల్లలను దూరంగా ఉండే మరో పాఠశాలలకు పంపాలంటే కిలోమీటర్ పైగా నడుమురు పాఠశాలకు పంపాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత దూరం నడవాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. పాఠశాలను యథావిథిగా కొనసాగించకుంటే తమ పిల్లలను ఇంటి దగ్గరే ఉంచుకుంటామన్నారు. పాఠశాల ఎక్కడ ఉందో అక్కడే కొనసాగించాలని మండల విద్యాశాఖ అధికారికి అర్జీ సమర్పించివిన్నవించుకుంన్నారు.
