కురుపాం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులను పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా విడుదల చేశారు. శుక్రవారం కురుపాం నియోజకవర్గ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు Toyaka Jagadeeshwari ముఖ్య అతిథిగా పాల్గొని నిధులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలోని రైతులకు అందుతున్న లబ్ధిని వివరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 39,084 మంది రైతులకు మూడో విడత కింద రూ.22.71 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద రూ.6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.14,000 కలిపి రైతులకు ఏడాదికి మొత్తం రూ.20,000 ఆర్థిక సాయం అందుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతు కుటుంబాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే జగదీశ్వరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని, అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తున్నామని, సాగు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా Narendra Modi మరియు N. Chandrababu Naidu రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ఎమ్మెల్యే సహా ఇతర నేతలు రైతులతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి, రైతు సంఘాల నాయకులు దేవకోటి వెంకటనాయుడు, గురాన శ్రీరామ్ మూర్తి నాయుడు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఎంపీపీలు, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.








