జియ్యమ్మవలస (పార్వతీపురం మన్యం జిల్లా) : రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.
శుక్రవారం జియ్యమ్మవలస మండలం కె.టి.వాడ పంచాయతీ పరిధిలోని నీచుకువలస గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా.. నీకోసం” కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని చెప్పారు. అందులో భాగంగా సాగునీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నీటి భద్రతను కల్పించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించడం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా అదనపు విలువను సృష్టించడం, పెట్టుబడులు మరియు సంక్షేమ పథకాల ద్వారా రైతులకు అండగా నిలవడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రైతులపై పెట్టుబడి భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000కు తోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 చేర్చి మొత్తం రూ.20,000లను మూడు విడతలుగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఆమె తెలిపారు. సంక్షేమంతో పాటు రైతుల ద్వారా సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వరి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. “రైతన్నా.. మీకోసం” కరపత్రాలను పంపిణీ చేస్తూ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, భరోసా గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకుడు నిమ్మక జయరాజు, ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ కడ్రక కళావతి, అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, మండల కన్వీనర్ జోగి భుంజగరావు, వట్టిగెడ్డ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యం నాయుడు, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు గురాన శ్రీరామూర్తి నాయుడు తదితరులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.








