పార్వతీపురం : మాతా, శిశు ఆరోగ్య సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పిలుపునిచ్చారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు మాతా, శిశు వైద్య సేవల్లో నైపుణ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన నర్సులకు శుక్రవారం సాయంత్రం జిల్లా ఆరోగ్య కార్యాలయంలో డాక్టర్ భాస్కరరావు చేతుల మీదుగా ధ్రువపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులకు ‘దక్షత’, ‘ఎస్.బి.ఏ’ (Skilled Birth Attendant), ‘ఎన్.ఎస్.ఎస్.కె’ (Navjaat Shishu Suraksha Karyakram) వంటి కీలక అంశాలపై సమగ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
- ఎస్.బి.ఏ శిక్షణ: 21 రోజులు
- దక్షత శిక్షణ: 6 రోజులు
- ఎన్.ఎస్.ఎస్.కె శిక్షణ: 3 రోజులు
ప్రసవ సమయంలో తలెత్తే క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, ప్రసవానంతరం బాలింతలు మరియు నవజాత శిశువులకు అత్యవసర సంరక్షణ అందించడం, హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. మాతా–శిశు మరణాలను తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగ శివజ్యోతి, గైనకాలజిస్టులు డాక్టర్ కమల, డాక్టర్ త్రివేణి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గణేష్ చైతన్య, డాక్టర్ రాజీవ్, డిఐఓ డాక్టర్ వై. విజయ్ మోహన్, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి. జగన్ మోహనరావు, డాక్టర్ ఎం. వినోద్ కుమార్, ఇంచార్జి డిపిహెచ్ఎన్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








