పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని జాయింట్ కలెక్టర్ సి. ఎస్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న అన్ని రైతు సేవా కేంద్రాలను ఈ నెల 29వ తేదీ సాయంత్రంతో మూసివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 281 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు మొత్తం 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను పారదర్శకంగా అందించడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపింది. మొత్తం రూ. 617 కోట్లను 42,309 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చెల్లింపులు జరగడం వల్ల రైతులకు తక్షణ ప్రయోజనం కలిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఇంకా ఖరీఫ్ పంటకు సంబంధించిన ధాన్యం ఎవరి వద్దైనా మిగిలి ఉంటే, వారు వెంటనే స్పందించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 29 గడువు లోపల సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను పొందాలని కోరారు. గడువు ముగిసిన అనంతరం కొనుగోలు కేంద్రాలు పనిచేయవని స్పష్టం చేశారు.








