- జంక్ ఫుడ్కు దూరం.. సంప్రదాయ వంటకాలే ఆరోగ్యం: సీడీపీఓ జి. రజని దుర్గ
పార్వతీపురం – మొండెఖాల్/గుజ్జవై : చిన్నారులు మరియు తల్లుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘8వ పోషణ పక్వాడా’ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గుజ్జవై మరియు మొండెఖాల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఐసీడీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో సీడీపీఓ జి. రజని దుర్గ పాల్గొని లబ్ధిదారులు, తల్లిదండ్రులకు పలు ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.
శిశువుల మెదడు అభివృద్ధి విషయంలో తొలి మూడు సంవత్సరాలు అత్యంత కీలకమని ఆమె తెలిపారు. ఈ సమయంలో సరైన పోషణ, ప్రేమ, సంరక్షణ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని వివరించారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఆటల ద్వారా నేర్చుకునే విద్యా విధానం అవసరమని సూచించారు.
పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక స్క్రీన్ టైమ్ వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అలాగే జంక్ ఫుడ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, సంప్రదాయ వంటకాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుజ్జవై సర్పంచ్ ఆరిక నాగేశ్వర రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహార లోపాన్ని నివారించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి. జానకమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








