పాలమూరులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే కాంగ్రెస్ వంశీచందర్ రెడ్డిని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సభ నిర్వహించింది. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పిలుపునిచ్చారు.
తమ ప్రభుత్వం జోలికొస్తే అంతుచూస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను సామాన్య కార్యకర్త నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేశారు. పదవులు కాదు కార్యకర్తలే శాశ్వతమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావును చూస్తే.. బీఆర్ఎస్ బిల్లా రంగా సమితిగా అనిపిస్తుందని సెటైర్లు వేశారు. కృష్ణా జలాలు తెలంగాణకు రాకుండా రాయలసీమకు తరలిస్తే అప్పటి సీఎం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
ప్రధానితో భేటీ తర్వాత వస్తున్న విమర్శలపైనా రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రధానిని కోరాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందన్నారు. ఘర్షణ వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండకూడదనే వినతి పత్రం ఇచ్చానని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించపోతే మోదీపైనా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డిని ఎంపీగా, జీవన్రెడ్డి ఎమ్సెల్సీగా గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలునిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి ఉచిత బస్సు, గృహజ్యోతి , ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలకు పెంపు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. 3 నెలలుగా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సీఎంగా, మోదీ పీఎంగా పదేళ్లు ఉండొచ్చు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండకూడదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పాలమూరు బిడ్డ తెలంగాణను పాలించకూడదా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరో 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు.