పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు: మత్తు పదార్థాల వినియోగం పై అవగాహన పెంచుతూ, యువతను సరికొత్త దిశలో నడిపించేందుకు సాలూరు పట్టణంలో మంగళవారం ఒక భవ్యమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించబడింది. వెంకటేశ్వర డీలక్స్ సెంటర్ నుండి బోసు బొమ్మ వరకు సాగిన ఈ ర్యాలీలో వివిధ కళాశాలల విద్యార్థులు, పోలీస్ శాఖ, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల వలన శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. “మత్తుకు బానిసలు కాకూడదు. యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి” అని వారు పిలుపునిచ్చారు. మత్తులో మునిగిపోయిన జీవితాలు యోగ్యమైన దిశలో సాగవు అని, ఆ అలవాట్లు సమాజానికే నష్టం కలిగిస్తాయని వివరించారు.
“గంజాయి వద్దు – ఆరోగ్యం ముద్దు” అనే నినాదాలతో జెండాలు, ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని నిర్వాహకులు తెలిపారు.
సమాజంలో ఆరోగ్యవంతమైన పౌరులను పెంచాలంటే ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వామ్యం కావాలని నిర్వాహకులు ప్రజలతో విజ్ఞప్తి చేశారు.