- నిర్మాణంలో ఉన్న తాగునీటి పథకాలు వేగంగా పూర్తి చేయాలి
- ప్రభుత్వ గురుకుల పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల కు తాగునీటి సరఫరా చేయాలి
- నీటిపారుదలశాఖ, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
సంగారెడ్డి : జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతానికి తాగునీటి సరఫరా నిరవధికంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ, నీటిపారుదల, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంజీరా బ్యారేజీ, సింగూర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కు జరుగుతున్న నీటి సరఫరా వివరాలు, మంజీరా బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి, నారింజ వాగు, సింగూర్ పరివాహక ప్రాంతాల సమాచారం, నూతన చెరువుల నిర్మాణ పనుల పురోగతి తదితర అంశాలను సమీక్షించారు.
ప్రస్తుతం బ్యారేజీల నీటిమట్టాలు ఎంత ఉన్నాయి, నీటి నిల్వలు ఎంతవరకు సరిపోతాయన్న అంశాలపై అధికారులతో విపులంగా చర్చించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నాణ్యమైన తాగునీరు ప్రతి గ్రామానికీ, ప్రతీ ఇంటికీ చేరేలా చర్యలు తీసుకోవాలని Collector పి. ప్రావీణ్య స్పష్టం చేశారు.
జరాసంఘం, న్యాల్కల్ మండలాల్లో అసంపూర్ణంగా ఉన్న మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో ఇప్పటికే ఉన్న నీటి సరఫరా లైన్లలో లీకేజీలు ఉండకుండా, అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజలకు నిరాటంకంగా, నాణ్యమైన తాగునీరు అందించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మిషన్ భగీరథ డీఈ రఘువీర్, ఏఏ పాషా, పబ్లిక్ హెల్త్ ఈఈ కృష్ణ మోహన్, నీటిపారుదల, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.