- బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి కె. సంతోష రావు
తిరుపతి:వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించడమే ఎపిఎస్ఎడిసిఎల్ లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు పేర్కొన్నారు. ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండిగా కె.సంతోష రావు శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సిఎండి కె. సంతోష రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో సిఎండిగా బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఇంధన శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. సంస్థలో ఐటి వింగ్ ను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులకు సత్వర, మెరుగైన సేవలందిస్తామన్నారు. అదేవిధంగా ఐటి వింగ్ తో అనుసంధానం చేస్తూ ఆధునాతన సాంకేతికతతో ఎనర్జీ ఆడిట్ ను నిర్వహించడం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాతోపాటు గృహ, పారిశ్రామిక ణవినియోగదారులకు కూడా నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసులను సకాలంలో విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత తొమ్మిది నెలల కాలంలో 65,207 సర్వీసులను విడుదల చేయడం జరిగిందన్నారు. రైతులు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ను మంజూరు చేసే స్థాయికి సంస్థ చేరుకుంటుందన్నారు. ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండిగా కె. సంతోష రావు పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) వి.ఎస్. బాబు, చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, ఎస్.హెచ్. రషీద్, వి. సురేష్ కుమార్, వై. లక్ష్మీనరసయ్య, డి.వి. చలపతి, పి. అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె. విజయకుమార్ రెడ్డి, కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, జాయింట్ సెక్రటరీ ఎ. రాధా జయశ్రీ, ఓఎస్డి ఎన్. శ్రీనివాసులు, తితిదే బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఎపిఎస్ పిడిసిఎల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
పాదచారుల దాహార్తిని తీర్చేందుకు వీలుగా ఎపిఎస్ పిడిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదచారుల కోసం ప్రతి రోజూ ఉదయం మజ్జిగ, సాయంత్రం వరకు చల్లటి తాగునీరును అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ వి. ఎస్. బాబు, చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, వై. లక్ష్మీనరసయ్య, కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, జాయింట్ సెక్రటరీ ఎ. రాధాజయశ్రీ, జనరల్ మేనేజర్ యం. గోపాలకృష్ణ, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ యం. కృష్ణా రెడ్డి, డిప్యూటీ జనరల్ మేనేజర్లు కె. సహదేవరెడ్డి, పి. సురేంధర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాసు రెడ్డి, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.