అమరావతి : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇంకా చెప్పాలంటే… ఉద్రిక్తతలు యుద్ధరూపం దాల్చాయి. పాక్ బలగాలను, వారి కుట్రలను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. మన సైనికుల ధైర్యసాహసాలకు యావత్ దేశ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. మరోవైపు, సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన నెల జీతాన్ని (రూ. 2,17,000) జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉగ్రవాద నిర్మాలనలో మన సాయుధ బలగాలు చూపిస్తున్న ధైర్యం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. సాయుధ దళాల కృషి ప్రజలందరిలో జాతీయ భావనను పెంపొందించాలని ఆకాంక్షించారు.