జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా పరిగణిస్తున్నారు. జగిత్యాల జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తీవ్రమైన ఎండలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్లో 44.3 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లాలోని మెందోరాలో 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఎండలో తిరగకపోవడమే మంచిదని సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.