తిరుపతి : జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్జీదారులు ఇప్పటికే దాఖలు చేసిన అర్జీలు ఇంకా పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకోవాలన్నా 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే ప్రజలు తమ సమస్యలను Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకునే సౌకర్యం కల్పించబడిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 19న ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ఈ నెల 19వ తేదీ సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసల్ సిస్టం – పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు.
ప్రజలు తమ పూర్తి వివరాలతో పాటు సమస్యలకు సంబంధించిన అర్జీలను సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీలు ఇచ్చిన వారు సంబంధిత స్లిప్పును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుల ఫోన్కు మెసేజ్ వస్తుందని, అందుకే తమ మొబైల్ ఫోన్ను తరచుగా పరిశీలించాలన్నారు.
నోటీసులు, ఎండార్స్మెంట్లు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నామని, అలాగే రిజిస్టర్ పోస్టు ద్వారా అర్జీదారులు ఇచ్చిన చిరునామాకు పంపిస్తున్నామని తెలిపారు. అర్జీని సరిగా, పూర్తిగా పూరించాలని, పునరావృత అర్జీలు ఇచ్చేవారు పాత రసీదును తీసుకురావాలని సూచించారు.
జిల్లా ప్రజలు ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కోరారు.










