తిరుపతి జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిపై జిల్లా పోలీస్ శాఖ కీలక సమీక్ష నిర్వహించింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకటరావు (పరిపాలన), రవి మనోహరాచారి (శాంతిభద్రతలు) తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై ఎస్పీ విడివిడిగా సమగ్ర సమీక్ష నిర్వహించి, దర్యాప్తు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ , వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కేసుల దర్యాప్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం సహించబోమని హెచ్చరిస్తూ, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. ప్రతి కేసుపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమయపాలన పాటించాలని సూచించారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించే చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నచిన్న వివాదాలను ముందుగానే పరిష్కరించి, అవి పెద్ద సమస్యలుగా మారకుండా చూడాలని సూచించారు.
మహిళలు మరియు చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యంతో విచారించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సమన్వయంతో పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలిపారు.









