contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూమన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం! .. టీటీడీ అంతర్గత సమాచారం లీక్

ఆంధ్రప్రదేశ్ : టీటీడీలో అంతర్గత సమాచారం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకా తేదీ కూడా ఖరారు కాని పాలకమండలి సమావేశపు ఎజెండా వివరాలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి బయటపెట్టడం పెను వివాదానికి దారితీసింది. ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ ప్రస్తుత యాజమాన్యం, వివిధ కారణాలతో 45 మంది ఉద్యోగులపై వారం రోజుల్లో వేటు వేయనున్నట్లు ప్రకటించింది.

వివాదానికి కారణమైన వ్యాఖ్యలు
సోమవారం విలేకరులతో మాట్లాడిన భూమన, కోయంబత్తూరుకు చెందిన జీ స్క్వేర్ అనే సంస్థ ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిందని, దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని 24వ ఎజెండాగా చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, అసలు పాలకమండలి సమావేశం తేదీ గానీ, ఎజెండా గానీ ఇంకా ఖరారు కాలేదు. ఇంత గోప్యంగా ఉండే ఎజెండా అంశం భూమనకు ఎలా తెలిసిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీలోని బోర్డు సెల్‌లో ఉన్న కొందరు కీలక అధికారులు ఈ సమాచారాన్ని చేరవేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో తన వర్గీయులు టీటీడీలో 2,000 మందికి పైగా ఉన్నారని భూమన ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందన
ఈ వివాదంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. “వివిధ కారణాలతో 45 మంది ఉద్యోగులపై వారం రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరు ఆలయ నిర్మాణంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. “జీ స్క్వేర్ సంస్థకు చెందిన దాత సుమారు 50 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయం నిర్మించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వారు కేవలం ఆగమశాస్త్రం ప్రకారం ప్రణాళిక ఇవ్వమని మాత్రమే టీటీడీని కోరారు” అని నాయుడు తెలిపారు.

రాజకీయ దుమారం
రెండుసార్లు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన, ప్రస్తుత పాలకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తరచూ ఆరోపణలు చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గోవుల మృతి, క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు వంటి అంశాలను ప్రస్తావిస్తూ టీటీడీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. స్థానికుడై ఉండి కూడా శ్రీవారిని రాజకీయాల్లోకి లాగడం తగదని పలువురు హితవు పలుకుతున్నారు. ఈ వ్యవహారంపై భూమనపై మూడు పోలీస్ ఫిర్యాదులు దాఖలైనా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :