contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్థాన్‌కు వెళ్లొద్దు… అమెరికా పౌరులకు అలర్ట్!

పాకిస్థాన్‌లో నెలకొన్న ఆందోళనకర భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ప్రయాణాలు చేయవద్దని అమెరికా తమ పౌరులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదం, నేరాలు, అంతర్యుద్ధ పరిస్థితులు, కిడ్నాప్‌ల వంటి ప్రమాదాలు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, పాకిస్థాన్ ప్రయాణ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు గురువారం కొత్త ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది.

పాకిస్థాన్‌కు ‘లెవెల్–3’ కేటగిరీ హెచ్చరికను జారీ చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. లెవెల్–3 అంటే అధిక ప్రమాదం ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ప్రధాన రవాణా కేంద్రాలు, మార్కెట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, రైళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఉగ్రదాడులు జరగవచ్చని అడ్వైజరీలో పేర్కొంది. ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తుంఖ్వా (కేపీ) ప్రావిన్స్, గతంలో కేంద్ర పాలిత గిరిజన ప్రాంతాలుగా (FATA) ఉన్న ప్రాంతాలకు ‘లెవెల్–4’ హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రాంతాలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని స్పష్టంగా ఆదేశించింది.

ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది మాత్రమే కాకుండా సాధారణ పౌరులే లక్ష్యంగా హత్యాయత్నాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ మూలాలున్న అమెరికన్ పౌరులకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది.

బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారని, కరాచీ, ఇస్లామాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ గతంలో దాడులు జరిగినట్లు అడ్వైజరీలో గుర్తు చేసింది. పాకిస్థాన్‌లో అనుమతి లేకుండా నిరసనలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, అలాంటి ప్రాంతాలకు సమీపంలో ఉన్నా భద్రతా దళాల నిఘాకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గతంలో నిరసనల్లో పాల్గొన్న అమెరికన్ పౌరులను నిర్బంధించిన ఘటనలు ఉన్నాయని తెలిపింది.

అంతేకాకుండా, పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం లేదా అధికారులను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినా నిర్బంధించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇదిలా ఉండగా, జనవరి 21 నుంచి 75 దేశాలకు చెందిన వలస వీసాల ప్రాసెసింగ్‌ను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. దీనిపై స్పందించిన పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం, ఈ నిలిపివేత తాత్కాలికమేనని, త్వరలోనే సాధారణ వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :