- జాతీయ రహదారి అధికారులకు లేఖ ద్వారా విజ్ఞప్తి
నెల్లూరు – ముంబాయి జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు, మరణాలు సంభవించకుండా అవసరమైన ప్రత్యేక చర్యలు జాతీయ రహదారి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు భారత జాతీయ రహదారుల అధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నెల్లూరు – ముంబాయి జాతీయ రహదారి ఆత్మకూరు నియోజకవర్గంలో సంగం మండలం జెండాదిబ్బ నుండి జిల్లా సరిహద్దు బాట వరకు విస్తరించి ఉందన్నారు.జాతీయ రహదారి నిర్వహణ చాలా నాసిరకంగా ఉందని, ముఖ్యంగా ప్రమాద హెచ్చరికలు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాక సైన్ బోర్డులు, రోడ్డు మార్కింగ్, లైటింగ్, గుంతలు పూడ్చడం డ్రెయిన్లు, జంక్షన్ల అభివృద్ది లేని కారణంగా ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. గతంలోనూ ఈ విషయమై లేఖ ద్వారా అధికారులకు సూచించినట్లు తెలిపారు.జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణాలు సాగించే వారికి రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయమై మా దృష్టికి కూడా తీసుకొచ్చారని అన్నారు.వెంటనే అధికారులు ఆత్మకూరు నియోజకవర్గంలోని జాతీయ రహదారి అభివృద్ది పనులు చేపట్టి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు జాతీయ రహాదారి ప్రమాణాలకు తగ్గట్లుగా రోడ్డు పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నామని అన్నారు.