అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో, బొత్స ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ ఏమైనా పుడింగి అనుకుంటున్నారా? అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఏం చూసుకుని అంత అహంభావం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక అగ్ర కథానాయకుడిని ఉద్దేశించి సభలో ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవిని అన్ని మాటలు అంటుంటే జనసేన పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన నిలదీశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను ఆయన సొంత పార్టీ అయిన టీడీపీ కూడా ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు.
అసెంబ్లీలో బాలకృష్ణ ఆ మాటలు సాధారణంగానే అన్నారా లేక ఏదైనా ప్రత్యేక అజెండాతో ఆ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానం కలుగుతోందని బొత్స అన్నారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే శాసనసభ స్పీకర్, బాలకృష్ణ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తేలాలని బొత్స డిమాండ్ చేశారు.