తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిర్వహించిన ఆందోళనల వివరాలను దద్దాల నారాయణ యాదవ్ జగన్కు వివరించినట్లు తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల నిర్వహించిన రిలే నిరాహార దీక్షల గురించి వివరించినట్లు పేర్కొన్నారు.
రిలే నిరాహార దీక్షల సందర్భంగా మొదటి రోజే దీక్ష భగ్నం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, తనను అరెస్టు చేయడం తదితర అంశాలను కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.
అక్రమ కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని ఆయన చెప్పారు. పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
కనిగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం, కష్టకాలంలో నాయకులు, కార్యకర్తలకు అండగా నిలవడం, రిలే నిరాహార దీక్షలు, నిరసన ర్యాలీని విజయవంతం చేయడంపై వైఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేసి అభినందించినట్లు దద్దాల నారాయణ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.








