వెల్దుర్తి–తూప్రాన్ : వెల్దుర్తి మండల కేంద్రంలోని స్త్రీ సమైక్య భవనంలో మంగళవారం వెల్దుర్తి–మాసాయిపేట ఉమ్మడి మండలాలకు చెందిన మహిళా సంఘాల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల పొదుపు, ఆర్థిక స్వావలంబన, కుటుంబ ఆర్థిక ప్రగతిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళలు చిన్న మొత్తాలతో ప్రారంభించే పొదుపు అలవాటు భవిష్యత్తులో వారికి బలమైన ఆర్థిక భరోసాగా మారుతుందని పేర్కొన్నారు.
మహిళా సంఘాల ద్వారా పరస్పరం సహకరించుకుంటూ స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా ఎదగాలని సునీత లక్ష్మారెడ్డి సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు మరింత పటిష్టంగా మారుతాయని, మహిళలు అభివృద్ధి చెందితే సమాజం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.
“మహిళ చేతిలో ఆర్థిక బలం ఉంటే కుటుంబం బలపడుతుంది. మహిళ ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలందరూ ఐక్యతతో ముందుకు సాగుతూ తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మహిళల సాధికారతే సమాజ అభివృద్ధికి అసలైన పునాది అని సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మహిళా సంఘాలు తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.








