జమ్ముకశ్మీర్: కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది.
ఇటీవల జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి మోదీ, ఒమర్ అబ్దుల్లా చర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడి ఘటన అనంతరం నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
గత నెల 22వ తేదీన పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద సంఘటన తర్వాత ప్రధానమంత్రి మోదీ, ఒమర్ అబ్దుల్లా నేరుగా సమావేశం కావడం ఇదే మొదటిసారి.