contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమెరికాలో భారత విద్యార్థి ఘరానా మోసం .. వీసా రద్దు, దేశ బహిష్కరణ .. !

అమెరికా : ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడి స్థానిక పోలీసులకు చిక్కాడు. నార్త్ కరోలినా రాష్ట్రంలో ఓ వృద్ధురాలిని మోసం చేసి డబ్బు కాజేయడానికి ప్రయత్నించిన కిషన్ కుమార్ సింగ్ (21) అనే భారతీయ విద్యార్థిని గైల్‌ఫోర్డ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం (జీసీఎస్‌వో) అధికారులు అరెస్ట్ చేశారు. చట్టాన్ని అమలు చేసే అధికారిగా నటిస్తూ ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు.

మోసం జరిగిందిలా..
స్టోక్స్‌డేల్ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల వృద్ధురాలికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ చేసిన వారు తాము ఫెడరల్ ఏజెంట్లు, డిప్యూటీలమని పరిచయం చేసుకున్నారు. ఆమె బ్యాంకు ఖాతాలకు వేరే రాష్ట్రంలోని నేర కార్యకలాపాలతో సంబంధం ఉందని నమ్మబలికారు. తక్షణమే పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసి, “భద్రత కోసం” తమకు అప్పగించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో బాధిత మహిళ నుంచి ఆ డబ్బును స్వీకరించడానికి కిషన్ కుమార్ సింగ్ ఫెడరల్ ఏజెంట్‌గా నటిస్తూ ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పటికే అప్రమత్తమైన గైల్‌ఫోర్డ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగి, సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

విద్యార్థి వీసాపై వచ్చి..
పోలీసుల విచారణలో సింగ్ 2024 నుంచి స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నట్లు తేలింది. ఒహాయోలోని సిన్సినాటి సమీపంలో నివసిస్తున్నాడని, ఈ మోసంలో నేరుగా పాలుపంచుకున్నాడని అధికారులు నిర్ధారించారు. గైల్‌ఫోర్డ్ కౌంటీ షెరీఫ్ డానీ హెచ్. రోజర్స్ కూడా కిషన్ కుమార్ సింగ్ అరెస్ట్‌ను ధ్రువీకరించారు.

ఈ కేసులో దోషిగా తేలితే కిషన్ కుమార్ సింగ్ తీవ్రమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా చట్టాల ప్రకారం అతని వీసా రద్దు కావడమే కాకుండా, దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :