కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ను శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభమ్ నగరాలె పూలమొక్కను అందించి కమీషనర్కు స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గార్డు అందించిన గౌరవ వందనం స్వీకరించారు.
పోలీస్ స్టేషన్ హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ను పర్యవేక్షించి, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, కేటాయించబడిన రెయిన్జాకెట్ వంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం కేటాయించిన ఎకరం పది గుంటల భూమిని పోలీసు కమీషనర్ పరిశీలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ (CCTNS)లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు.
తెలంగాణ పోలీసులు వినియోగించే సీసీటీఎన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్ల జారీ, టీఎస్-కాప్, హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్లో ఆర్థిక, ఆర్థికేతర నేరాలు, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలని ఆదేశించారు.
ఎఫ్.ఐ.ఆర్ ఇండెక్స్ను పరిశీలించి, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపారు. వాటికి గల కారణాలను తెలుసుకొని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గన్నేరువరం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్-సెక్టార్లుగా విభజించి, వాటికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని ఆదేశించారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు వంటి విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెలా వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నగరాలే, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. సదన్ కుమార్ , గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.