కరీంనగర్, గోదావరిఖని : “మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు. చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోండి” అంటూ గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు ఈరోజు గోదావరిఖనిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల కింద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. “మీ మనసును ఆరోగ్యంగా ఉంచుకోండి, ఒక చెట్టును నాటండి” అనే నినాదంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెట్ హార్ట్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ ఎం. రమేష్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదువుకోవాలని, తల్లిదండ్రులు, గురువులకు గర్వకారణంగా నిలవాలని తెలిపారు.
డ్రగ్స్, గంజాయి వాడకం యువతను నశింపజేసే మార్గం అని హెచ్చరించిన ఆయన, ఈ మత్తు పదార్థాలను విక్రయించే వారు ఎక్కడ కనిపించినా పోలీసులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రమేష్, భూమేష్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తు వ్యసనాల నివారణపై విద్యార్థులలో మంచి అవగాహన కలిగించింది.సామాజిక బాధ్యతను చాటుకున్న పోలీస్ శాఖకు స్థానికులు అభినందనలు తెలిపారు.