చండీగఢ్: పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం సమీపంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించడం కలకలం రేపింది. చండీగఢ్లోని సెక్టార్ 37లో సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయం బయట పార్క్ చేసి ఉంచిన ఒక స్కూటీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్లు సమాచారం.
పేలుడు విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.
బీజేపీ సీనియర్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పేలుడుతో పెద్దగా ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశ్వని శర్మ తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పేలుడు వెనుక ఉన్న కారణాలు, అనుమానితులపై పోలీసులు దృష్టి సారించారు.








