మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ముదురుతున్నాయి. బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్పై ఇరాన్ దాడి జరిపినట్లు అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు వెలువరించాయి. ఫైనాన్షియల్ టైమ్స్ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ దాడి అనంతరం సంబంధిత కంపెనీ ప్రాంగణంలో మంటలు చెలరేగినట్లు, వాటిని సమయానికి అదుపులోకి తీసుకువచ్చినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, దాడికి గురైన సంస్థ పేరు లేదా జరిగిన నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు.
అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికన్ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెజాన్ కంపెనీ మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, గత వారం ఈ ప్రాంతంలో డ్రోన్ కార్యకలాపాల కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సేవలకు అంతరాయం కలిగిందని సంస్థ అంగీకరించింది.
డేటా సెంటర్లు ఎందుకు లక్ష్యం?
ఇటీవల వరకూ కేవలం పౌర మౌలిక వసతులుగా భావించిన డేటా సెంటర్లు ఇప్పుడు వ్యూహాత్మక ఆస్తులుగా మారుతున్నాయి. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, కమ్యూనికేషన్స్ వంటి కీలక రంగాలు క్లౌడ్ టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి. ఈ సేవలు అమెరికా సైనిక, నిఘా వ్యవస్థలకు మద్దతు ఇస్తున్నాయని పేర్కొంటూ, వాటిని చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ వాదిస్తోంది.
భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, యుద్ధం స్వరూపం మారుతోంది. సైబర్ దాడుల నుంచి భౌతిక డేటా సెంటర్లపై నేరుగా దాడులు చేసే దిశగా పరిణామం జరుగుతోంది. వాణిజ్య డేటా సెంటర్పై ఒక దేశం ప్రత్యక్ష భౌతిక దాడి జరపడం ఇదే తొలిసారి కావచ్చని వారు చెబుతున్నారు.
ఈ పరిణామం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల భద్రతపై కొత్త చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.








