మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గంగాపూర్ శివారులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన మెదక్–రామాయంపేట ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది.
స్థానికులు రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న చిరుతను గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన చిరుతను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఘటన స్థలంలో రక్తపు మడుగులు ఉండటం, చిరుత శరీరంపై గాయాలు కనిపించడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లే అది మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రోడ్డు దాటే సమయంలో ప్రమాదానికి గురై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఏదనే విషయాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించే అవకాశముందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికారులు సూచించారు.








