గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్, 7బీ కాలనీలో చెత్త తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బస్తీవాసులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
స్థానికుల కథనం ప్రకారం, గత కొన్ని రోజులుగా కాలనీలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు చెత్త పేరుకుపోవడం వల్ల పాములు, విషపురుగులు, దోమలు ఇళ్లలోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
కాలనీలోని ఓ ఇంటి సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ఇంటి యజమాని మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే, అక్కడికి వచ్చిన ఓ మున్సిపల్ సూపర్వైజర్ చెత్తను తొలగించేందుకు నిరాకరించడమే కాకుండా, “తీయను… ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు ఇంటి యజమాని ఆరోపించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన మున్సిపల్ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే చెత్త తొలగించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా స్పందించడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కాలనీలోని పలువురు యువకులు, బాధిత ఇంటి యజమానితో కలిసి మున్సిపల్ కమిషనర్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంబంధిత సూపర్వైజర్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతో పాటు, కాలనీలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని వారు కమిషనర్ను కోరారు.








