జగిత్యాల జిల్లా, మెట్పల్లి: భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణంలో ర్యాలీ సందడిగా సాగింది.
బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్తో కలిసి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని రామాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. సుమారు 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దాదాపు 2,000 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
దేశ పౌరులలో ఐక్యతా భావాన్ని పెంపొందించడంతో పాటు దేశభక్తిని చాటిచెప్పే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. వందేమాతరం గీతానికి పార్లమెంట్లో చట్టబద్ధమైన గుర్తింపు కల్పించడం గొప్ప విషయమని వారు అన్నారు.
ఈ ర్యాలీ సందర్భంగా విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో మెట్పల్లి పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.








