కనిగిరి: స్థానిక కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను విద్యార్థుల ఉత్సాహం, సందడితో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి. శివరాములు, జనవిజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ భాషా, కళాశాల కరస్పాండెంట్ ముక్కు కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా షేక్ గయాజ్ భాషా మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, ప్రతిరోజూ కళాశాలకు హాజరై పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు. పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సి.వి. రామన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
కళాశాల కరస్పాండెంట్ ముక్కు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించేందుకు కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా వరుసగా మూడుసార్లు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బీఎస్సీ బోటనీ విద్యార్థిని ఏ. లలితను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. అనంతరం విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల నృత్యాలు, ఇతర కళా ప్రదర్శనలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమం విజయవంతం కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.








