- ఉప్పల్లో సైజెన్ శేఖర్ ఆధ్వర్యంలో భారీ నిరసన
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ ఉప్పల్లో భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నాయకుడు సైజెన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసం, అవ్యవస్థ, ప్రజా సమస్యలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇది వెయ్యి రోజుల పాలన కాదని, ప్రజలపై సాగుతున్న ‘పీడన’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసంగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి, వాటి విషయంలో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో చేపట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో రూ.50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం రూ.20 వేల కోట్ల మేర మాత్రమే చేశారని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్లో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.








