గోదావరిఖని: గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో భాస్కర్ కిరాణా దుకాణం సమీపంలో శిథిలావస్థకు చేరిన శిలాఫలకాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. విద్యార్థులు, చిన్నారులు, స్థానికులు తరచూ సంచరించే ప్రధాన కూడలిలో ఈ శిలాఫలకం ప్రమాదకరంగా మారిందని స్థానికులు డివిజన్ కార్పొరేటర్ బాబు మియాకు సమాచారం అందించారు.
ఈ ప్రాంతంలో ఉదయం వేళ విద్యార్థులు, చిన్న పిల్లలు బస్సుల కోసం వేచి ఉంటుంటారని, శిథిలావస్థలో ఉన్న శిలాఫలకం కారణంగా ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించిన కార్పొరేటర్ బాబు మియా సెప్టెంబర్ 5న మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు.
అనంతరం సెప్టెంబర్ 8న మున్సిపల్ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ బాబు మియా ఆధ్వర్యంలో శిథిలావస్థలో ఉన్న శిలాఫలకాన్ని తొలగించారు.
భద్రత కోసమే తొలగింపు
శిలాఫలకాన్ని తొలగించడం వెనుక ఎలాంటి కుట్రపూరిత ఉద్దేశం లేదని, ఎవరిపైనా కక్ష సాధింపు చర్యగా దీనిని చేపట్టలేదని కార్పొరేటర్ బాబు మియా స్పష్టం చేశారు. ఎవరి మీద కోపంతోనో, ఎవరినైనా ఉద్దేశించో శిలాఫలకాన్ని తొలగించలేదని తెలిపారు.
విద్యార్థులు, చిన్నారులు, స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శిథిలావస్థలో ఉన్న నిర్మాణాన్ని తొలగించినట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అవసరమైతే ఇదే శిలాఫలకాన్ని మరో సురక్షిత ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేటర్ బాబు మియా సూచించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మున్సిపల్ అధికారులు సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.








