contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మందు పాతర పేల్చిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 8 మంది జవాన్లు కాగా.. ఒకరు వ్యాన్ డైవర్‌ అని భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు. వారిని రాజధాని రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమచారం. ఈ సంఘటన సోమవారం బెద్రే – కుత్రు రహదారిపై చోటు చేసుకుంది. మరోవైపు శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఐదుకి పెరిగింది.

మావోయిస్టుల కోసం ప్రత్యేక భద్రత దళంతోపాటు పోలీసులు సంయుక్తంగా నారాయణ్ పూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని మావోయిస్టులు గమనించి.. కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు సైతం వెంటనే స్పందించి.. ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొలుత నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు.

అయితే అదే ప్రాంతంలో మరో మావోయిస్ట్ మృతదేహాన్ని భద్రత దళాలు గాలింపు చర్యల్లో భాగంగా గుర్తించాయి. దీంతో సదరు ఎన్ కౌంటర్‌లో మరణించిన వారి సంఖ్య ఐదుకు పెరిగింది. ఇక వీరిలో ఇద్దరు మహిళలని భద్రతా దళాలు వివరించాయి.ఈ ఎన్ కౌంటర్‌లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సైతం మరణించిన విషయం విధితమే.

నారాయణ్‌పూర్, బస్తర్, కండగావ్, దంతేవాడ జిల్లాల్లో మావోయిస్టుల కోసం శుక్రవారం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గాలింపు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలనకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసి పోవాలని పిలుపు నిచ్చింది. అలా లోంగిపోయిన వారికి జీవనోపాధి సైతం కల్పిస్తుంది. ఆ క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.

కానీ ఛత్తీస్‌గఢ్‌లో వారి ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో తరచు మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు చోటు చేసుకొంటున్నాయి. ఇక 2026, మార్చి మాసాంతానికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకొన్న సంగతి తెలిసిందే. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు కేంద్రం వడి వడిగా అడుగులు వేస్తోంది.

అదీకాక ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్లుల హింసపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రమంలో ఇటీవల ఆయన ఆ రాష్ట్రంలో సైతం పర్యటించారు. ఈ సందర్బంగా లోంగిపోయిన మావోయిస్టులతో సమావేశమయ్యారు. అలాగే మావోయిస్టు బాధిత కుటుంబాలతో సైతం ఆయన భేటీ అయ్యారు. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమక్షంలో 11 మంది మావోయిస్టులు గడ్చిరోలి పోలీస్ స్టేషన్‌లో లోంగిపోయిన సంగతి తెలిసిందే. వారిలో మల్లోజుల వేణుగోపాల రావు భార్య తారక్క సైతం వారిలో ఉన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :