పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం సీతానగరం మండల కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
ఎన్డీఏ, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే విజయచంద్ర వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. “ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్కు పూర్తి స్థాయిలో నిరోధం అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇ-వేస్ట్ నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలి,” అని సూచించారు.
అలాగే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. “పది వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించాలి,” అని పిలుపునిచ్చారు.
ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తే మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్, జిల్లా ప్రత్యేక అధికారి భరత్ కుమార్ గుప్తా, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.