జమ్మూకశ్మీర్ : కిష్తివాడ్ లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల హైడవుట్ పై నిఘా వర్గాల సమాచారం మేరకు సైనిక బలగాలు ఈ రోజు ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులు నెలల తరబడి తిష్ట వేసిన ఇంటిని చుట్టుముట్టాయి. ‘ఆపరేషన్ ఛత్రు’ పేరుతో కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది.
భద్రతాబలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. సైన్యం ఎదురు కాల్పులు జరుపుతోంది. భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసు బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.










