contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్ జగన్

రాష్ట్రంలో రైతుల పరిస్థితిని చూస్తుంటే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనాల్సిన దుస్థితి నెలకొందని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని, పండుగలా ఉండాల్సిన వ్యవసాయం దండగలా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.

రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమాను ఒక హక్కుగా అందించామని, దీని కింద రూ.7,800 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఉరి వేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులుంటే కేవలం 19 లక్షల మందికి మాత్రమే బీమా సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు.

రూ.1,100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయని, వాటిని ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పడం లేదని ప్రశ్నించారు.

ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద ఏటా రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చి, రెండేళ్లలో రూ. 40,000కు బదులుగా కేవలం రూ. 10,000 మాత్రమే ఇచ్చారని జగన్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని, దళారులు రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

మొంథా తుపాను విషయంలో ప్రభుత్వం హడావుడి చేసిందని, ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలు వెల్లడిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :