సదుం మండలం : అన్నమయ్య జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్లో విధులు నిర్వహిస్తున్న పోస్టుమాస్టర్ ధనలక్ష్మిపై వేధింపులు, బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె గత నాలుగు సంవత్సరాలుగా చెరుకువారిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్లో పోస్టుమాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2025 జూన్ నెలలో ఎంఓగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ఇన్స్పెక్షన్ నిమిత్తం చెరుకువారిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్కు వచ్చారని తెలిపారు. ఆ సమయంలో కార్యాలయంలో ఖాతాదారుల పాస్బుక్స్తో పాటు రూ.8,26,000 నగదు ఉన్నట్లు గుర్తించి, “ఇంత నగదు కార్యాలయంలో ఎందుకు ఉంచారు?” అంటూ నగదు మరియు సంబంధిత దరఖాస్తులను సీజ్ చేస్తున్నామని చెప్పి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్కు వివరణ ఇచ్చి తీసుకెళ్లాలని సూచిస్తూ నగదును తన వెంట తీసుకెళ్లినట్లు ధనలక్ష్మి ఆరోపించారు. అలాగే, ఈ వ్యవహారంలో పుంగనూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్ మోహన్, సబ్ పోస్టుమాస్టర్ సుబ్రహ్మణ్యం, గాండ్లపల్లి పోస్టుమాన్ ఉమాపతి, సదుం పోస్టు ఉమెన్ సోనం కలిసి తనపై ఒత్తిడి తీసుకువచ్చారని, “నువ్వు నాన్-లోకల్, ఇక్కడ నీకు ఎవరూ మద్దతు ఇవ్వరు. ఫిర్యాదు చేసినా ఎవ్వరూ నమ్మరు. నీపై కేసులు పెడతాం” అంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. ఈ విషయమై సదుం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ స్పందన రాలేదని, అనంతరం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ధనలక్ష్మి తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, పోస్టల్ శాఖలో పారదర్శకతను పాటించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారుల స్పందన కోసం వేచిచూస్తున్నారు.








