తెలంగాణలో ఎండలు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నాయి. భానుడి భగభగతో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గురువారం ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో 38.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ములుగు, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీమ్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో సుమారు 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.








