కరీంనగర్ జిల్లా: మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులకు కరీంనగర్ కోర్టు వినూత్న శిక్షలు విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైనందుకు ఒకరికి 3 రోజుల సామాజిక సేవ, మరొకరికి 6 రోజుల సామాజిక సేవ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్కు చెందిన తేజ్ సింగ్ (35) కరీంనగర్లో నివాసముంటూ హోటల్లో పనిచేస్తున్నాడు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన అతడిని సోమవారం గౌరవనీయ II స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ డాక్టర్ ఈదుల లక్ష్మీ సమక్షంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు అతనికి రూ. 2,000 జరిమానా విధించింది. అయితే జరిమానా చెల్లించలేకపోవడంతో, మార్చి 23 నుండి 27 వరకు మూడు రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.
ఇక తిమ్మాపూర్కు చెందిన బోనాల సాయికృష్ణ కూడా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో కోర్టు అతనికి రూ. 5,000 జరిమానా విధించడంతో పాటు, ఆరు రోజుల పాటు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సామాజిక సేవ చేయాలని తీర్పునిచ్చింది.
కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులు సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయడానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, “ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరి భద్రత కోసం రూపొందించబడ్డాయి. వాటిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జరిమానాలు మాత్రమే కాకుండా, కోర్టు ద్వారా ఇలాంటి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు.








