కరీంనగర్ జిల్లా : పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పందించారు. ఈ మేరకు ప్రజలకు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు.
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థ ఎప్పటిలాగే సజావుగా కొనసాగుతోందని, ఎక్కడా ఎటువంటి కొరత లేదని తెలిపారు.
సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చే తప్పుడు సమాచారం, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కమిషనర్ సూచించారు. కొరత ఏర్పడుతుందనే భయంతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయడం, ఇళ్లలో నిల్వ చేయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
“ప్రజలు శాంతంగా ఉండాలి. ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ప్రస్తుతం ఎటువంటి అత్యవసర పరిస్థితి లేదు. కావున ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు,” అని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు.
అదే సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు.








