అనంతపురం జిల్లా గుత్తి పట్టణం మరియు మండల వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. జై శ్రీరామ్ నామస్మరణతో పట్టణం మారుమోగింది. మండలంలోని ప్రతి రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలను శోభాయమానంగా అలంకరించి, ఆలయ కమిటీలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరై సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, గుత్తి టిడిపి ఇన్చార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, జనసేన నియోజకవర్గ బాధ్యుడు వాసగిరి మణికంఠ కూడా పాల్గొన్నారు.
అతిథులు స్థానిక అరుంధతి కాలనీలోని రామాలయం, మండలంలోని జక్కలచెరువు గ్రామ రామాలయం, అలాగే భక్తులకు ఎంతో విశ్వాసంగా నిలిచిన గుత్తి కోట రామస్వామి దేవాలయాలలో జరిగిన సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, రామాయణం మనకు కుటుంబ బంధాల విలువను తెలియజేసే మహాగ్రంథమని, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు యుగయుగాలకూ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ముందుగా కోట రామస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు, అన్నపూర్ణ సంస్థల అధినేత ప్రసాద్ ఆధ్వర్యంలో అతిథులకు పూలమాలలు వేసి, దుశాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణ తంతును నిర్వహించారు.
ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు భక్తి పరవశంతో వీక్షించి పులకించిపోయారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గుత్తి కోట రామస్వామి ఆలయ కమిటీ సభ్యులు, గుత్తి పట్టణం మరియు మండలానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు.








