కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రాణాంతకంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గన్నేరువరం, ఖాసీంపేట,యాస్వాడ, మైలారం,జంగపల్లి చొక్కారావురావుపల్లె, తదితర గ్రామాల్లో ఎక్కడికక్కడే విద్యుత్ తీగలు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నా వాటిని సరిచేయడానికి అధికారులు చొరవచూపడం లేదు. పొలాల్లోకి రైతులు వెళ్లాలన్నా, విద్యుత్ వైర్ల కింద ఉన్న పంట పొలాల్లో పనులు చేయాలన్నా కూలీలు బెంబేలెత్తున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నాయి. హార్వెస్టర్ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాదకరంగా ఉన్న పలు చోట్ల రైతులే తాత్కాలికంగా కర్రలతో స్తంభాలను ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో కరెంట్ తీగలను తాకుతూ చెట్లు, పొదలు పెరిగినా వాటిని తొలగించే చర్యలు చేపట్టడం లేదు. గాలికి కొమ్మలు తగిలి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వేలాడుతూ యమపాశాలుగా మారిన విద్యుత్ తీగలను సరిచేయాలని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు
◆ ఖాసీంపేట లో విద్యుత్ వైర్లతో ఎగిసిపడ్డ మంటలు – తప్పిన ప్రమాదం
ఖాసీంపేట గ్రామానికి చెందిన బొజ్జ శ్రీకాంత్,మంద ఐలయ్య వ్యవసాయ పొలంలో ఈ నెల 4 వ తేదిన సోమవారం హార్వెస్టర్ తో వరి కోత పనులు నిర్వహిస్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పరవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో వరిగడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. అప్రమతమైన రైతులు పచ్చి కొమ్మలు తో మంటలను అర్పారు. విద్యుత్ అధికారులకు పలుమార్లు సమస్యను చెప్పిన ఎవరు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు దగ్గర స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను లేకుండా చూడాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.








