కరీంనగర్ టౌన్ : కరీంనగర్ నగర పరిధిలోని కాశ్మీర్గడ్డ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ రక్తపాతానికి దారితీయగా కన్నతండ్రిని కుమారుడే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం స్థానిక నివాసి ఆరెల్లి మల్లేష్(55) కుమారుడు నరసయ్య(21) తీవ్రంగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నరసయ్య తన తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. కళ్లెదుటే భార్యను కొడుతుండటంతో కొడుకు ఆరెల్లి నర్సయ్య వెంటనే అడ్డువచ్చి తండ్రి ని వారించే ప్రయత్నం చేశారు.తల్లిపై దాడిని చూసి నరసయ్య ఆగ్రహం మరింత నశాలానికి అంటింది. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని తండ్రి మల్లేష్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘోర దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రక్తపు మడుగులో మునిగి, ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసిన చిన్న కుమారుడు ఆరెల్లి రమేష్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు.కేవలం తల్లిపై దాడిని అడ్డుకున్నందుకే ఈ హత్య జరిగిందా? లేక వీరి మధ్య గతంలో ఏవైనా ఆస్తి వివాదాలు, పాత కక్షలు ఉన్నాయా? అనే పలు కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే కాశ్మీర్గడ్డ ప్రాంతంలో ఇలాంటి ఘోరం జరగడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. ప్రస్తుతం నిందితుడు నరసయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.








