తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇసుక క్వారీని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పూడికతీత పేరుతో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని ఆరోపించారు.
క్వారీ వద్ద భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో లారీల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులు సమర్థవంతంగా పర్యవేక్షణ చేపట్టకపోవడంతో అక్రమాలు మరింత పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అధిక స్థాయిలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాలు క్షీణించి, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. పర్యావరణానికి, వ్యవసాయానికి నష్టం కలిగించే అక్రమ ఇసుక దందాను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.








