contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నీట్-యూజీ వివాదం .. దుష్ప్రచారంపై నిఘా హెచ్చరికలు

న్యూఢిల్లీ : నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో, విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి దుష్ప్రచారం చేపట్టే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ప్రజల్లో గందరగోళం సృష్టించడం, అశాంతిని ప్రేరేపించడం లక్ష్యంగా ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

అధికారుల సమాచారం ప్రకారం, యూనిఫాంలో ఉన్న సైనికులు లేదా పోలీసు సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు చూపించే నకిలీ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఈ వీడియోలను నిజమైనవిగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యమని నిఘా అధికారులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ ప్రధాన సంస్థలపై, ముఖ్యంగా భారత సైన్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడమే ఈ దుష్ప్రచారం వెనుక ప్రధాన ఉద్దేశమని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో ఎక్కువసేపు అందుబాటులో ఉంటే ప్రజల్లో అపోహలు, అనుమానాలు పెరిగే ప్రమాదం ఉందని, అందువల్ల వాటిని వేగంగా గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని నిఘా వర్గాలు గుర్తు చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా భారత సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు తప్పుడు వీడియోలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. అదే తరహా ప్రచారం ప్రస్తుత పరిస్థితుల్లోనూ పునరావృతమయ్యే అవకాశాన్ని భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి.

నిరసనలు ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు సైనిక సిబ్బంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు కనిపించే సుమారు 20 అనుమానాస్పద వీడియోలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఆ వీడియోల్లో వ్యక్తుల గుర్తింపుకు సంబంధించిన నేమ్ ట్యాగ్‌లు, ఇన్సిగ్నియా లేదా ఇతర ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారిందని వెల్లడించారు.

వీడియోలను కొద్ది గంటలపాటు వైరల్ చేసి, అనంతరం వాటిని తొలగించే విధానాన్ని దుష్ప్రచారకులు అనుసరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూలాలను గుర్తించడం కష్టతరమవుతోందని, కానీ అప్పటికే అవి ప్రజల్లో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియో లేదా సమాచారాన్ని ధృవీకరించకుండా నమ్మవద్దని, అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని విశ్వసించాలని భద్రతా సంస్థలు ప్రజలకు సూచించాయి. అలాగే రానున్న రోజుల్లో ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉన్నందున అన్ని సంబంధిత విభాగాలు అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :