గోదావరిఖని : తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన సిద్ధాంత బలం, మార్గదర్శకత్వం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే సంకల్పంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించి, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన సిద్ధాంతాలను మార్గదర్శకంగా తీసుకుని అహర్నిశలు ఉద్యమం కొనసాగించారని గుర్తు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నారాయణదాసు, మారుతి, నీరటి శ్రీనివాస్, దొమ్మటి వాసు, కొలుగూరి సాయి, కోడి రామకృష్ణ, కిరణ్ జీ, హరికృష్ణతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








