పెద్దపల్లి : మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడంతో పాటు, వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం పనితీరు, మహిళా సాధికారత కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళలకు అందుతున్న సేవలు, ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఆర్థిక సాధికారత తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించడంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం కీలక పాత్ర పోషించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, పొదుపు, రుణ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
మహిళలకు అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి, ఆయా రంగాల్లో అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. శిక్షణ పూర్తయిన మహిళలకు ఉపాధి లేదా స్వయం ఉపాధి లభించే వరకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలి
మహిళలు కేవలం ఉద్యోగాలు పొందే స్థాయిలో కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆహార తయారీ, ఉద్యానవన ఉత్పత్తుల విలువ ఆధారిత తయారీ, సేవా రంగం వంటి విభిన్న రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ ఆర్థిక సాధికారతకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర రంగాల్లో మహిళలకు లభిస్తున్న అవకాశాలను జిల్లాలోని మహిళలకు చేరువ చేయాలని ఆదేశించారు.
వీ హబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి జిల్లాలో అందుబాటులో ఉన్న వీ హబ్ సేవలను మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యాపార ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం, మార్కెటింగ్ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్న సహాయాన్ని మహిళలకు చేరువ చేయాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువతులు, ఉద్యోగార్థులు, వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలను గుర్తించి వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలపై గ్రామ, మండల స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
మహిళా సాధికారతకు సంబంధించిన అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, శిక్షణ, ఉపాధి, ఆర్థిక సహాయ కార్యక్రమాలను ఒకే వేదిక ద్వారా చేరువ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మహిళలు ప్రారంభించే స్వయం ఉపాధి, వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగేందుకు శిక్షణతో పాటు మార్కెటింగ్, రుణ సదుపాయాలు, అవసరమైన ఇతర సహకారం అందించాలని ఆదేశించారు. మహిళలకు అందిస్తున్న శిక్షణ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహించి పురోగతిని నమోదు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా ఉపాధి అధికారి, ఇంటర్మీడియట్ అధికారి కల్పన, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ వెంకటేష్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, వీ హబ్ సమన్వయకర్త, టాస్క్ సమన్వయకర్త కౌసల్య, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధులు, సఖి బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








